- మధ్యవర్తిగా రికార్డ్ అసిస్టెంట్..!
- పట్టా కోసం ఎకరానికి రూ.10వేల డిమాండ్..?
- 3 ఎకరాలకు రూ.30 వేలు కోరినట్లు రైతుల ఆరోపణ
- గిఫ్ట్ డీడ్ పట్టాకు డబ్బుల డిమాండ్ కలకలం
- మేడం డబ్బులు అడుగుతున్నారని చెప్పిన రికార్డ్ అసిస్టెంట్
- వేలేరు మండలంలో బయటపడ్డ ‘డీల్’ బాగోతం!
- అధికారుల వ్యవహారంపై ‘స్టార్ త్రినేత్రం’ను సంప్రదించిన రైతులు
Hanumakonda District: హనుమకొండ జిల్లా వేలేరు మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. గిఫ్ట్ డీడ్ ఆధారంగా భూమికి పట్టా మంజూరు చేయించుకునేందుకు వచ్చిన రైతుల నుంచి ఎకరానికి రూ.10వేల చొప్పున డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం 3 ఎకరాల భూమికి రూ.30 వేలు ఇవ్వాలని కోరినట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగాల్సిన ప్రక్రియకు డబ్బులు అడగడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
రైతుల కథనం ప్రకారం.. పట్టా కావాలంటే “మేడం డబ్బులు అడుగుతున్నారు” అని రికార్డ్ అసిస్టెంట్ తమతో చెప్పినట్లు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రైతుల్లో మరింత అనుమానాలకు తావిచ్చాయని, ప్రభుత్వ కార్యాలయంలో జరిగే పనులకు ఇలాంటి డిమాండ్లు రావడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ఉన్న వివరాలు, ఫోన్ సంభాషణల ఆధారంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
వేలేరు మండలంలో వెలుగులోకి వచ్చిన ఈ ఆరోపణలు స్థానికంగా సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ బాధితులు ‘స్టార్ త్రినేత్రం’ను ఆశ్రయించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. విచారణ అనంతరం ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంతుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ALSO READ: Warangal: లంచం ఇస్తే.. పట్టా..!
Last Updated on August 4, 2026 · 8:36 AM by Star Trinethram



