Hyderabad: హైదరాబాద్ మహానగరాన్ని ఒకప్పుడు కుదిపేసిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి హత్య కేసులో మల్కాజ్గిరి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆస్తి, పెన్షన్ డబ్బుల కోసం కన్నతండ్రినే అత్యంత దారుణంగా హత్య చేసి, అనంతరం శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆధారాలు మాయం చేయాలని ప్రయత్నించిన కొడుకు, కూతురుకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ ఘోర నేరానికి సహకరించిన మృతుడి భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. కుటుంబ బంధాలకంటే ధనదాహం ఎంతటి విషాదాలకు దారితీస్తుందో ఈ కేసు మరోసారి స్పష్టం చేసింది.
దర్యాప్తు వివరాల ప్రకారం.. బాధితుడు రైల్వే శాఖలో గూడ్స్ రైలు లోకో పైలట్గా పనిచేసి, ఆరోగ్య కారణాలతో 2000 సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయనకు వస్తున్న పెన్షన్తో పాటు సొంత ఇంటిపై కుటుంబ సభ్యుల దృష్టి పడింది. తండ్రి జీవించి ఉన్నంతకాలం ఆస్తి, ఆర్థిక ప్రయోజనాలు తమకు పూర్తిగా దక్కవని భావించిన భార్య, కొడుకు, కూతురు కలిసి ఒక పథకం ప్రకారం హత్యకు కుట్ర పన్నారు.
2019 ఆగస్టులో వృద్ధుడి ఆహారంలో విషం కలిపి ఇవ్వడంతో ఆయన మృతి చెందారు. అయితే హత్య విషయం బయటపడుతుందనే భయంతో నిందితులు అక్కడితో ఆగలేదు. శవాన్ని బయటకు తరలించడం ప్రమాదకరమని భావించి, మృతదేహాన్ని ఇంట్లోనే ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ బకెట్లలో దాచిపెట్టారు. అనంతరం వాటిని రహస్యంగా పారవేయాలని ప్రయత్నించారు.
కొన్ని రోజుల తర్వాత ఇంటి పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన దుర్వాసన వ్యాపించడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇంట్లో పరిశీలించగా బకెట్లలో కుళ్లిపోయిన మానవ అవశేషాలు కనిపించడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, సమగ్ర దర్యాప్తు చేపట్టి 2019 ఆగస్టు 21న మృతుడి భార్య, కొడుకు, కూతురిని అరెస్ట్ చేశారు.
సుదీర్ఘకాలం విచారణ సాగిన అనంతరం కోర్టు నిందితులపై నమోదైన సాక్ష్యాధారాలు, వాంగ్మూలాలను పరిశీలించి తీర్పు వెలువరించింది. ఈ హత్యను అత్యంత అరుదైన, అమానుషమైన నేరంగా పరిగణించిన న్యాయస్థానం కొడుకు, కూతురుకు మరణశిక్ష విధించింది. కుట్రలో భాగస్వామిగా ఉన్న భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది.
కుటుంబ సభ్యుల చేతిలోనే ఒక వృద్ధుడు ప్రాణాలు కోల్పోవడం, ఆ తర్వాత శవాన్ని ముక్కలు చేసి దాచిపెట్టడం వంటి సంఘటనలు సమాజాన్ని కలచివేస్తున్నాయి. కేవలం ఆస్తి, డబ్బు కోసం రక్త సంబంధాలను సైతం మరచిపోయిన ఈ ఘటనపై కోర్టు ఇచ్చిన తీర్పు నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలిచింది.
ALSO READ: Ponguleti Srinivas: ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదు



