Ponguleti Srinivas: ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసి, వాస్తవ పరిస్థితులను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. మంగళవారం సత్తుపల్లి పట్టణ శివారులోని వేశ్యకాంతల చెరువు పరిసర ప్రాంతాలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించి భూముల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ ఎండి రెహనా కమల్ పాషా, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి భూభాగాన్ని పరిశీలించిన మంత్రి, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన తీరుపై అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిష్పక్షపాత సర్వే నిర్వహించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని పేదలకు ప్రభుత్వ భూములను పంపిణీ చేసే దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం పట్టా భూమిగా నిర్ధారణ అయితే సంబంధిత హక్కుదారులకు అప్పగించాలని, ప్రభుత్వ భూమిగా తేలితే వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. భూముల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రజా ఆస్తులను కాపాడటం ప్రతి అధికారికి బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రభుత్వ స్వాధీనంలోకి వచ్చిన భూములకు స్పష్టమైన సరిహద్దులు నిర్ణయించి, భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూముల పరిరక్షణతో పాటు వాటి వినియోగంపై కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ఈ పర్యటనలో సత్తుపల్లి తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ, జేఈలు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ALSO READ: Flight No Smoking Policy: స్మోకింగ్పై నిషేధం ఉన్నా.. విమానాల్లో ఈ యాష్ ట్రే ఎందుకు..?
Last Updated on June 9, 2026 · 7:38 PM by Star Trinethram



