టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు
ఢిల్లీ పర్యటనలో చిట్చాట్
కర్ణాటక, తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒకటే
బీజేపీతో పాటు బీఆర్ఎస్ పని ఖతం అయినట్లే!
నైనీ కోల్ బ్లాక్ అంశం మీడియా సృష్టి
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై టీపీసీసీ చీఫ్ ధీమా
Mahesh Kumar Goud: తెలంగాణలో ఎన్ని రాజకీయ పోరాటాలు చేసినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోనూ, తెలంగాణలోనూ బీజేపీ పరిస్థితి ఒకటేనని, ప్రజలు ఇప్పటికే ఆ పార్టీని తిరస్కరించారని అన్నారు.
బీజేపీతో పాటు బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు కూడా ముగింపు దశకు చేరిందని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని బలంగా నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేసే పనిలో ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం రెండు డీసీసీ అధ్యక్షుల ఎంపికతో పాటు మహిళా అధ్యక్షురాలి నియామకం ఇంకా పెండింగ్లో ఉందని వెల్లడించారు.
సోషల్ మీడియా రాజకీయాలపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ సోషల్ మీడియాను పట్టుకుని రాజకీయంగా పాకులాడుతున్నారని వ్యాఖ్యానించారు. వాస్తవ సమస్యలపై పోరాటం చేయకుండా వర్చువల్ రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికలపై స్పందించిన టీపీసీసీ చీఫ్.. నిజామాబాద్లో బీఆర్ఎస్ ప్రభావం పూర్తిగా కనుమరుగైందన్నారు. అక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్కు అనుకూల వాతావరణం నెలకొందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయ భవిష్యత్తుపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. కవిత సొంత పార్టీ ఏర్పాటు చేసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని తెలిపారు. అయితే ఇవన్నీ రాజకీయ ఊహాగానాలేనని అన్నారు.
నైనీ కోల్ బ్లాక్ అంశాన్ని పూర్తిగా మీడియా సృష్టిగా మహేశ్ కుమార్ గౌడ్ కొట్టిపారేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్లోని కేసీ వేణుగోపాల్తో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. కావాలని కొందరు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీనే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే తథ్యమని టీపీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలే తమ రాజకీయ అజెండా అని, అదే బలంగా ప్రజల ముందుకు వెళ్లనున్నామని ఆయన అన్నారు.
ALSO READ: WPL: ముంబైకి మూడో విజయం.. వరుస ఓటములతో ఆర్సీబీ ఆందోళన
Last Updated on January 28, 2026 · 6:57 PM by Star Trinethram



