నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో కుటుంబాల మధ్య చెలరేగిన విభేదాలు చివరికి ఒక పసిబిడ్డ తల్లి ప్రాణాలను బలిగొన్నాయి. నాంపల్లి మండలం కేతెపల్లి గ్రామంలో శనివారం ఈ అమానుష ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన నగేష్ యాదవ్ కు పెళ్లికి ముందే మీసాల సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. నగేష్ కు పెళ్లైన తరువాత కూడా ఈ సంబంధం కొనసాగడంతో అతని భార్య మమతతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవలకు కారణం సుజాతనేనని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
ప్రియుడు భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టేసిన మహిళ
నల్లగొండ జిల్లా, నాంపల్లి మండలంలోని కేతపల్లిలో జరిగిన దారుణ ఘటన
స్థానికంగా ఉండే నగేష్ యాదవ్ కు సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం
ఈ విషయంపై నగేష్ భార్య, సుజాత మధ్య గొడవ.. ఆమెపై పగ పెంచుకున్న సుజాత
ఈ క్రమంలోనే నిప్పంటించగా స్పాట్… pic.twitter.com/W1Hoy3LsAt
— PulseNewsBreaking (@pulsenewsbreak) January 31, 2026
ఈ నేపథ్యంలో మమతను చంపాలని సుజాత ముందుగానే పక్కా ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. కారం, కోళ్లను కోసే కత్తి, పెట్రోల్ వెంట తీసుకుని శనివారం మమత ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో మమత తన 6 నెలల పసిబిడ్డను ఎత్తుకుని ఉంది. అక్కడికి వెళ్లిన సుజాతకు మమతకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. మాటల తూటాలు క్షణాల్లోనే హింసాత్మకంగా మారాయి. కోపంతో ఊగిపోయిన సుజాత తాను తీసుకెళ్లిన పెట్రోల్ను మమతపై పోసి నిప్పంటించింది.
ఒక్కసారిగా మంటల్లో చిక్కుకున్న మమత ప్రాణాలు కాపాడుకునేందుకు వీధిలోకి పరుగులు తీసింది. అయితే అప్పటికే ఆమె శరీరం పూర్తిగా కాలిపోయింది. మంటల వేడిమి తట్టుకోలేక ఒళ్లో ఉన్న పసిబిడ్డను దూరంగా విసిరేసినా బాబు శరీరం సుమారు 80 శాతం కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని స్థానికులు వెంటనే నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మమతను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన అనంతరం నిందితురాలు సుజాత నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం. విషయం తెలిసిన వెంటనే నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు, ఎస్సై లింగారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు.
ALSO READ: పాపం కదా.. బోండా తింటూ చనిపోయాడు
Last Updated on January 31, 2026 · 1:01 PM by Star Trinethram



