Actress Rambha: ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన నటి రంభ తాజాగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, సహనటులు, డ్యాన్స్ అనుభవాలు, వ్యక్తిగత అభిరుచుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎన్నో విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రంభ, తన కెరీర్లో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సమకాలీన నటీమణుల్లో ఎవరు తనకు పోటీగా అనిపించేవారని అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రంభ మాట్లాడుతూ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమెను పోటీగా భావించలేదని, కానీ ఆమెతో కలిసి నటించే సమయంలో మాత్రం చాలా భయంగా అనిపించేదని తెలిపారు. తాను కొత్తగా సినీ పరిశ్రమలోకి వచ్చిన రోజుల్లో రమ్యకృష్ణ ఇప్పటికే సీనియర్ నటి కావడంతో ఆమెపై గౌరవంతో పాటు ఒక రకమైన టెన్షన్ ఉండేదని చెప్పారు. అయితే రమ్యకృష్ణ తనకు ఎంతో సహకారం అందించేదని, సెట్స్లో చాలా స్నేహపూర్వకంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. రోజా, మీనా వంటి నటీమణులతో తక్కువ సినిమాలు చేయడం వల్ల వారిని పోటీగా భావించే పరిస్థితి రాలేదని రంభ స్పష్టం చేశారు.
ప్రస్తుత తరం కథానాయికల గురించి కూడా రంభ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నయనతార, ఇలియానా, కాజల్, త్రిషలలో తనకు అత్యంత ఇష్టమైన నటి త్రిష అని వెల్లడించారు. త్రిష చాలా ఆప్యాయంగా మాట్లాడుతుందని, ఆమె ప్రవర్తన తనకు ఎంతో నచ్చుతుందని పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో అందరితో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిత్వం త్రిషలో కనిపిస్తుందని రంభ అభిప్రాయపడ్డారు.
యువ హీరోల గురించి మాట్లాడిన రంభ, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్లలో ఇప్పటికే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్లతో కలిసి నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. అయితే ప్రభాస్, మహేష్ బాబులతో ఇప్పటివరకు నటించలేదని చెప్పారు. భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా వారితో నటించేందుకు సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. తన కెరీర్లో చేసిన ప్రత్యేక గీతాల్లో “నాచోరే నాచోరే” పాట తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఆ పాట తనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందని, జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డా పేరు మాత్రం తనకే వచ్చిందని సరదాగా వ్యాఖ్యానించారు.
డ్యాన్స్ విషయానికి వస్తే రంభ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో చర్చకు దారితీస్తున్నాయి. చిరంజీవి తనకు అత్యంత ఇష్టమైన నటుడని, ఆయనకు తాను పెద్ద అభిమానిని అని చెప్పిన రంభ, డ్యాన్స్ విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అంకితభావం అసాధారణమని కొనియాడారు. ఒక చిన్న మూమెంట్ కోసం కూడా ఎన్టీఆర్ ఎంత కష్టపడతాడో చూసి ఆశ్చర్యపోయేదాన్నని చెప్పారు. పాదాలు వాచిపోయినా కూడా డ్యాన్స్ కోసం అతను చేసే కష్టాన్ని దగ్గరగా చూసానని తెలిపారు. అతని డెడికేషన్ చూసిన తర్వాత మైఖేల్ జాక్సన్ వచ్చినా తన దృష్టిలో ఎన్టీఆరే బెస్ట్ డాన్సర్ అని రంభ ప్రశంసలు కురిపించారు.
అలాగే ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా గురించి కూడా రంభ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుదేవా మాస్టర్ కొరియోగ్రాఫర్గా చాలా అద్భుతంగా పనిచేస్తారని, డ్యాన్స్లో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉందని తెలిపారు. సినీ పరిశ్రమలో తాను పనిచేసిన అనుభవాల్లో డ్యాన్స్కు సంబంధించిన ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని రంభ చెప్పారు.
Last Updated on May 7, 2026 · 3:10 PM by kiran Kumar




