Crime: గుంటూరు నగరంలో మరోసారి మద్యం మత్తులో జరిగిన హింసాత్మక ఘటన కలకలం రేపింది. కంకరగుంట గేటు సమీపంలోని నిర్మలా వైన్స్ వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు స్నేహితులపై అన్నదమ్ములు దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాత్రి వేళ వైన్స్ పై అంతస్తులో మందుబాబులతో కోలాహలం నెలకొన్న సమయంలో బుంగ బాలకృష్ణ, మారుతి పూర్ణచంద్రరావు ఇద్దరూ ఒకే టేబుల్ వద్ద కూర్చొని మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో ఎదురు టేబుల్ వద్ద దేవరకొండ స్వరూప్ నగర్, శశికుమార్ అన్నదమ్ములు కూడా మద్యం తాగుతున్నారు. కొద్దిసేపటికి అన్నదమ్ములిద్దరూ గట్టిగా మాట్లాడుకోవడం ప్రారంభించగా, ఆ శబ్దం వైపు పూర్ణచంద్రరావు చూడడం వివాదానికి నాంది పలికింది.
పూర్ణచంద్రరావు తమవైపు చూడటాన్ని గమనించిన అన్నదమ్ములు వెంటనే అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగారు. మాటా మాట పెరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో బాలకృష్ణ, పూర్ణచంద్రరావు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. అయితే పరిస్థితి అక్కడితో ముగియలేదు. కొద్ది సేపటికే మళ్లీ పూర్ణచంద్రరావు వద్దకు చేరుకున్న అన్నదమ్ములు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో బీరు సీసాను పగలగొట్టి పూర్ణచంద్రరావుపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో అతను భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు.
ఇదే సమయంలో బాలకృష్ణ కూడా అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించగా స్వరూప్ కుమార్, శశికుమార్ అతన్ని పట్టుకుని దాడి చేశారు. పై అంతస్తులోనే అతన్ని తలక్రిందులుగా వేలాడదీసి గుండెలపై బలంగా కొట్టడంతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. ఈ దృశ్యాలను గమనించిన వైన్స్ సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని అన్నదమ్ములను అడ్డుకుని బాలకృష్ణను వారి చేతుల నుంచి విడిపించారు. తీవ్రంగా భయపడిన బాలకృష్ణ అక్కడి నుంచి కిందకు పరుగెత్తాడు.
అయితే పరిస్థితి మరింత విషమించింది. కిందకు వచ్చిన అన్నదమ్ములు మరోసారి బాలకృష్ణపై దాడికి దిగడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే మద్యం మత్తులో ఉన్న అన్నదమ్ములు పోలీసులపై కూడా తిరగబడి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు.
దర్యాప్తులో స్వరూప్ కుమార్పై నర్సరావుపేట 2టౌన్, లాలాపేట, నగరంపాలెం పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే శశికుమార్పై కూడా నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కేసులు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో అన్నదమ్ములిద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ALSO READ: Success Story: వయస్సు 24 ఏళ్లు.. 4 నెలల్లో రూ.1 కోటి విలువైన కంపెనీ నిర్మాణం
Last Updated on April 22, 2026 · 11:09 AM by kiran Kumar



