Mamnoor Airport: వరంగల్ వాసుల కల నెరవేరుతుందా.. ఎయిర్ పోర్ట్ నిర్మాణం ఎంత వరకొచ్చింది..?
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి శరవేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయనుకునే లోపే అనేక కారణాల వల్ల అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
Mamnoor Airport: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి శరవేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయనుకునే లోపే అనేక కారణాల వల్ల అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కీలకమైన భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపుగా కొలిక్కి రావడంతో ఇక నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు లేవనే అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఈ ప్రాజెక్టుపై ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. వరంగల్ దశాబ్దాల కల సాకారం చేస్తూ మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కొన్ని నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మామూనూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఆపరేషన్స్కు కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతులు ఇచ్చింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ఇచ్చిన ఎన్వోసీకి కేంద్రం ఆమోదం తెలిపింది. అయినప్పటికీ మరే కారణాల వల్ల వెనుకడుగు పడుతుందోనన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల్ని వెంటాడుతోంది.
మరోపక్క ఎయిర్పోర్టు రావడం వల్ల ఎంతైతే లాభపడుతున్నామో.. అంతకంటే ఎక్కువ నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాకపోవడంతో కొన్నాళ్ల క్రితం ధర్నాకు దిగినట్లు వారు తెలిపారు. రైతుల ఆందోళనతో మామూనూరు ఎయిర్పోర్టు దగ్గర అప్పట్లో భారీగా పోలీసులు మోహరించారు. భూసేకరణ సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను రైతులు, వారి కుటుంబాలు అడ్డుకున్నాయి. దీంతో భూసేకరణ సర్వే తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్లో జీవో విడుదల చేసింది. కేంద్ర విమానయాన శాఖ సైతం భూ సేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి రాగానే పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే రూ.450 కోట్లు నిధులను కేటాయించింది. భూ సేకరణ ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే ఏఏఐ విమానాశ్రయ విస్తరణ పనులను ప్రారంభించనుంది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696.14 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిని 136 మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా, అది కూడా పూర్తి కావచ్చింది. ఏదైమైనా సాధ్యమైనంత తొందరగా ఎయిర్పోర్టు కోసం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని అధికారులు చెబుతున్నప్పటికీ ఇంకా పూర్తి కాకపోవడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. త్వరగా పూర్తి చేసి తమ కలను నెరవేర్చాలని అక్కడి ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Also Read: Shocking: పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత.. ప్రేమికుడికి తన భార్యను అప్పగించిన భర్త
Mamnoor Airport: వరంగల్ వాసుల కల నెరవేరుతుందా.. ఎయిర్ పోర్ట్ నిర్మాణం ఎంత వరకొచ్చింది..?