Hyderabad: భార్యపై పెంచుకున్న అనుమానం చివరకు ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. కన్నబిడ్డలు ఎదుటే జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. “నాన్నా.. అమ్మను చంపొద్దు” అంటూ చిన్నారి వేడుకున్నప్పటికీ కనికరం చూపని భర్త, భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి తేజస్వీనీనగర్లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్కు చెందిన కోమలి (31), అవినాష్ దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి జీవనం సాగిస్తున్నారు. వీరి పిల్లలకు 8, 9 సంవత్సరాల వయస్సు ఉంది. ఉపాధి కోసం సుమారు 6 నెలల క్రితం హైదరాబాద్కు వలస వచ్చిన ఈ కుటుంబం అత్తాపూర్లోని తేజస్వీనీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. కోమలి ఒక అపార్ట్మెంట్లో కాపలాదారుగా పనిచేస్తూనే అదే భవనంలోని పలువురు నివాసితుల ఇళ్లలో గృహ సహాయకురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. మరోవైపు అవినాష్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కోమలి వివిధ ఇళ్లలో పని చేయడం వల్ల కొన్నిసార్లు ఆలస్యంగా ఇంటికి రావడం జరుగుతుండేది. ఇదే విషయాన్ని కారణంగా చేసుకుని అవినాష్ కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అవినాష్, కోమలితో మరోసారి గొడవకు దిగాడు. ఈ వాగ్వాదం రాత్రంతా కొనసాగినట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగిన ఈ వివాదం చివరకు హింసాత్మక రూపం దాల్చింది. తీవ్ర ఆగ్రహానికి గురైన అవినాష్ ఇంట్లో ఉన్న కత్తితో భార్యపై దాడి చేశాడు. తండ్రి చేతిలో కత్తి చూసిన పెద్ద కుమారుడు భయంతో వణికిపోతూ “నాన్నా.. అమ్మను చంపొద్దు” అంటూ వేడుకున్నప్పటికీ అవినాష్ ఏమాత్రం వినిపించుకోలేదు. ప్రాణాలు కాపాడుకునేందుకు కోమలి అక్కడి నుంచి బయటకు పరుగులు తీసింది. అపార్ట్మెంట్ వెలుపలికి వెళ్లి సహాయం కోసం కేకలు వేస్తూ పరుగెత్తినా ఆమెను అవినాష్ వదిలిపెట్టలేదు.
కత్తితో వెంబడిస్తున్న సమయంలో అతని చేతిలోని ఆయుధం జారిపడటంతో అక్కడే ఉన్న స్క్రూడ్రైవర్ను తీసుకుని కోమలిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం సమీపంలో ఉన్న ఇనుప రాడ్డుతో ఆమె తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో కోమలి రోడ్డుపై కుప్పకూలిపోయింది. ఆమె కేకలు విన్న అపార్ట్మెంట్ నివాసితులు పెద్ద సంఖ్యలో బయటకు రావడంతో పరిస్థితి తీవ్రతను గ్రహించిన అవినాష్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న కోమలిని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించింది.
సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. అనంతరం నిందితుడు అవినాష్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు అత్తాపూర్ ఎస్సై పార్వతి తెలిపారు. తల్లి హత్యకు గురవడాన్ని కళ్లారా చూసిన ఇద్దరు చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది. అనుమానం, కుటుంబ కలహాలు చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకోవడంతో పాటు ఇద్దరు చిన్నారులను తల్లిలేని వారిగా మార్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ALSO READ: IND vs ENG: టీమిండియా టీ-20 జట్టు ప్రకటన.. కెప్టెన్గా ‘సర్పంచ్ సాబ్’
Last Updated on June 6, 2026 · 3:54 PM by DHEEKONDA SHIVAKRISHNA



