Warangal: వరంగల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వెలుగులోకి వచ్చిన అవినీతి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా నిర్వహించిన తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. కార్యాలయంలో జరుగుతున్న అక్రమ లావాదేవీలు, అనధికారిక వ్యక్తులతో సబ్ రిజిస్ట్రార్లు కొనసాగిస్తున్న సంబంధాలు ఈ దాడుల్లో బట్టబయలయ్యాయి. సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న జమాల్పూర్ రామ్ నర్సింహారావు, దేవులూరి ఆనంద్ తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తులను అనధికారికంగా డాక్యుమెంట్ రైటర్లుగా నియమించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యక్తులు అధికారులతో కలిసి రిజిస్ట్రేషన్ల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
తనిఖీల్లో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్న ఈ అనధికారిక రైటర్లు పంపిన పత్రాలకే ప్రాధాన్యత ఇస్తూ సబ్ రిజిస్ట్రార్లు పని చేస్తున్నట్లు వెల్లడైంది. మిగతా ప్రజల పత్రాలు పట్టించుకోకుండా ఆలస్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు కార్యాలయంలో పెండింగ్లో ఉన్న సుమారు 70 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా సబ్ రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైటర్ల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు వాట్సాప్ చాట్ల రూపంలో బయటపడ్డాయి. గత ఏడాది కాలంలోనే ఈ అక్రమ వ్యవహారాల ద్వారా సుమారు రూ.42 లక్షలు లంచాల రూపంలో వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కార్యాలయంలో సోదాలు ముగిసిన తర్వాత ఏసీబీ బృందాలు ఇద్దరు అధికారుల నివాసాలపై కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో లక్షలాది రూపాయల నగదు, అనుమానాస్పద ఆస్తులకు సంబంధించిన పత్రాలు బయటపడటం సంచలనం రేపింది. అయితే అత్యంత షాకింగ్ అంశం ఏమిటంటే.. ఒక అధికారి ఇంట్లోనే 200కు పైగా ప్రభుత్వానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు లభించడం. సాధారణంగా కార్యాలయంలో ఉండాల్సిన ఈ ముఖ్యమైన పత్రాలు వ్యక్తిగత ఇళ్లలో ఎందుకు ఉన్నాయనే అంశంపై అధికారులు తీవ్రంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా విస్మరించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడిన ఈ ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న నగదు, డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు బయటపడనున్నాయి.
ALSO READ: Lord Hanuman: హనుమంతుడి ఆశీస్సులున్న ఈ 4 రాశులవారు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే!
Last Updated on April 3, 2026 · 12:49 PM by Star Trinethram



