Telangana: మోగిన పురపోరు నగారా

ఫిబ్రవరి 11న పోలింగ్

ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు

116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు

జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ

స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు జనవరి 30 వరకు తమ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జనవరి 31న నామినేషన్ల స్క్రూటినీ చేపట్టనుండగా, అర్హత లేని నామినేషన్లను అధికారులు తిరస్కరించనున్నారు. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించి పట్టణ పాలనకు తమ ప్రతినిధులను ఎన్నుకోనున్నారు. అవసరమైన చోట ఫిబ్రవరి 12న రీపోలింగ్ చేపట్టనున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 52.43 లక్షల మందికి పైగా ఓటర్లు పాల్గొననున్నారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపుకోసం 136 ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ప్రభుత్వ పథకాలు, ప్రకటనలు, రాజకీయ కార్యక్రమాలపై కోడ్ ప్రకారం పరిమితులు విధించనున్నారు.

ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నగదు, మద్యం, ఇతర అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగేలా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

పోలింగ్ ఫలితాల అనంతరం ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై కీలక ప్రభావం చూపనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ALSO READ: Governor Jishnu Dev Verma: దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ

Last Updated on January 27, 2026 · 1:38 PM by Star Trinethram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles