Gang Assault Case: అస్సాం రాష్ట్రంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల యువతిపై గుంపుగా దాడి చేసి అత్యాచారం చేయడంతో పాటు ఆమె ఖాతా నుంచి రూ.10,000 బలవంతంగా బదిలీ చేయించుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణం ఫిబ్రవరి 19న జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాయంత్రం సమయంలో తన ప్రియుడితో కలిసి విహారానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. సిల్చార్ పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న బైపాస్ రోడ్డుపై వారు కారులో వెళుతుండగా, మరో వాహనంలో వచ్చిన కొందరు వ్యక్తులు వారిని అడ్డగించారు. మొదట వారిద్దరి వివరాలు అడిగిన ఆ వ్యక్తులు అకస్మాత్తుగా కత్తితో బెదిరించి దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అక్కడే ఉన్న 8 మంది వ్యక్తులు యువతిని బలవంతంగా లాగి తీసుకెళ్లి, ఆమె స్నేహితుడిని కొట్టి, ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటన అనంతరం దుండగులు అక్కడితో ఆగకుండా బాధితురాలిని బెదిరించి ఆమె ఖాతా నుంచి రూ.10,000 తమ ఖాతాలకు బదిలీ చేయాలని బలవంతం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాణభయంతో ఆమె డబ్బు బదిలీ చేయాల్సి వచ్చిందని సమాచారం. అనంతరం బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సిల్చార్ సదర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితురాలు ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితుల్లో ఇద్దరిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిని ఆశ్రమ రోడ్డు ప్రాంతానికి చెందిన నీలోత్పాల్ దాస్ (25), సుబోల్ దాస్ (27)గా గుర్తించి అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం బాధితురాలికి తప్పనిసరి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారి తీస్తోంది. ఈ దారుణంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ: Kadapa: లాడ్జిలో అర్ధరాత్రి కేకలు.. వెళ్లి చూస్తే..?
Last Updated on February 26, 2026 · 12:47 PM by Star Trinethram



