Municipal elections: మున్సిపల్ ఎన్నికల వేళ వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో పట్టణ కేంద్రంలోని 10వ వార్డులో బీజేపీ పార్టీ అభ్యర్థి తుమ్మల కల్యాణి సోమవారం ఉదయం నుంచే విస్తృత ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెల్లవారుజామునే ప్రచారం ప్రారంభించిన ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ స్థానిక ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. వార్డు పరిధిలోని వీధులు, కాలనీల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రచారంలో భాగంగా బీజేపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు. బీజేపీ సర్కార్ ఉంటేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్న నినాదంతో ముందుకు సాగారు. వర్ధన్నపేట పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే స్థానిక సంస్థల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి కల్యాణిని గెలిపించాలని, తాను గెలిస్తే వార్డు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని, సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.
ఈ ప్రచారంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాషాయ జెండాలు, పార్టీ నినాదాలతో వార్డు మొత్తం సందడిగా మారింది. ఇంటింటి ప్రచారంతో పాటు స్థానిక వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, కార్మికులను కలుస్తూ వారి మద్దతు కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మున్సిపాలిటీలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తుమ్మల కల్యాణి భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, ఆలోచించి ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ALSO READ: నిద్ర ఎక్కువైతే వచ్చే సమస్యలివే!
Last Updated on February 9, 2026 · 11:10 AM by Star Trinethram




